Showing posts with label cpm. Show all posts
Showing posts with label cpm. Show all posts

Monday, 6 October 2014

డీజిల్‌ ధరలను తగ్గించండి : సిపిఎం డిమాండ్

 న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ డీజిల్‌ ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం, చమురు మార్కెటింగ్‌ కంపెనీలు (ఓఎంసిలు) తిరస్కరించడాన్ని సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ముడి చమురు ధర బ్యారెల్‌కు 92 డాలర్లు తగ్గింది. 27మాసాల కాలంలో ఇదే అత్యంత కనిష్ట ధర. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క లీటరు డీజిల్‌పై విక్రయానికి రు.1.90 మొత్తాన్ని చమురు మార్కెటింగ్‌ కంపెనీలు సంపాదిస్తున్నాయని తెలుస్తోంది. ఇది 'అధిక రికవరీ' అని సిపిఎం పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. 2013 జనవరి నుండి ప్రతి నెల లీటరుకు 50పైసలు చొప్పున పెంచాలని ప్రభుత్వం చమురు మార్కెటింగ్‌ కంపెనీలను ఆదేశించింది. ఆనాడు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతూ వస్తున్న ముడి చమురు ధరలను దృష్టిలో పెట్టుకుని యుపిఎ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ మోడీ సర్కార్‌ డీజిల్‌ ధరలను తగ్గించకుండా ఆనాటి విధానాన్నే అనుసరిస్తోందని సిపిఎం విమర్శించింది. ఈ రకమైన నిష్క్రియాపరత్వం వల్ల ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతోంది. ముఖ్యంగా రైతులపై, చిన్న తరహా పరిశ్రమలపై, వస్తువుల రవాణా రంగంపై భారం పడుతోందని సిపిఎం విమర్శించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెద్ద ఎత్తున తగ్గిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తక్షణమే డీజిల్‌ ధరలను తగ్గించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది.

Sunday, 20 April 2014

మోడీ ప్రధానైతే దేశం రావణ కాష్టమే: తమ్మినేని

Tammineni Veerabhadram 
  
వరంగల్: నరేంద్ర మోడీ ప్రధానైతే దేశాన్ని రావణకాష్టం చేస్తాడని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖిల్లా వరంగల్ లో ఆదివారం ఆ పార్టీ నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. గుజరాత్ లో మూడు వేల మంది ముస్లీం మైనారిటీలను మోడీ ఊచకోత కోశారని విమర్శించారు. కులాలు, మతాల మధ్య కోట్లాటలు పెట్టి గుజరాత్ ను రావణ కాష్టంగా మార్చాడని తెలిపారు. మతోన్మాద మోడీని ప్రధానిని చేయడం తప్పు అని పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఓట్ల కోసం రామమందిర నిర్మాణం పేరుతో హిందువులను రెచ్చగొడుతున్నారన్నారు. బీజేపీ మతోన్మాద వైఖరిని వ్యతిరేకించాలని సూచించారు. మతాల మధ్య చిచ్చుపెట్టడం దేశానికి నష్టదాయకమన్నారు. మోడీని సమర్థిస్తేనే దేశంలో ఉండాలా లేకపోతే పాకిస్తాన్ వెళ్లాలా అని ప్రశ్నించారు. భారతదేశంలో అనేక రకాల మతాలకు చెందిన వారు ఐక్యమత్యంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. మతాల మద్య చిచ్చుపెడితే దేశం కుక్కలు చింపిన విస్తరాకు అవుతుందన్నారు. అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు రేషన్ కార్డులను తగ్గిస్తున్నాయని, సంక్షేమ పథకాలను తొలగిస్తున్నారని చెప్పారు. నిత్యవసరాల ధరలను పెంచి ప్రజలపై అధిక భారాలను మోపుతున్నాయని చెప్పారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం భూములను కట్టబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 లక్షల కోట్ల రూపాయలను ధనవంతులకు సహాయం చేసిందని మండిపడ్డారు. సిపిఎం ప్రజల పక్షాన పోరాడి పేదలకు గుడిసెలు వేయించిందని గుర్తు చేశారు. నీడనిచ్చిన ఎర్రజెండాను మరిచిపోద్దవని సూచించారు. లౌకికవాద శక్తులను, ప్రజల తరపున పోరాడే వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.