Thursday 7 August 2014

10 వామపక్ష పార్టీలు ప్రెస్ మీట్ నిర్వహించాయి... వాటి వివరాలు ఇవి....

10 వామపక్ష పార్టీల ప్రెస్ మీట్ జరిగింది. మధ్యాహ్నం వరకు చర్చించిన అంశాల గురించి ఇందులో వివరించారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర రాజకీయాల గురించి సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
1. పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడిని వామపక్ష పార్టీలు ఖండించాయి. ఇజ్రాయిల్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, పాలస్తీనాకు సంఘీభావంగా త్వరలో కార్యాచరణ ప్రకటించనున్నాయి.
2. మోడీ ప్రభుత్వం తిరోగామి విధానాలను అవలంభిస్తోంది. రక్షణ రంగంలో 49శాతం ఎఫ్ డిఐలకు పచ్చజెండా ఊపింది. ఇది దేశ భద్రతకు సవాలుగా పరిణమిస్తుంది. లాభాలొస్తున్న రైల్వేలోనూ మౌలిక సదుపాయాల రంగంలో 100శాతం ఎఫ్ డి ఐని అనుమతించింది. మరో వైపు మత ఉద్రిక్తతలనూ పెంచుతోంది.
3. రాష్ట్రంలో కెసిఆర్ చేస్తున్న ప్రకటనలకు ఆచరణకు పొంతన లేదనే అభిప్రాయానికి వామపక్ష పార్టీలు వచ్చాయి.
4. దళితుల భూములు : దళితులకు మూడెకరాల చొప్పున భూములు కేటాయిస్తామంటే అందరూ సంతోషించాం. పథకం ప్రకటించిన తరువాత దానిని అమలు చేయాలనే సంకల్పం, భూ పంపిణీ కోసం సేకరణ జాడ ఎక్కడా కనిపించడం లేదు. ఏడాదికి వెయ్యికోట్ల చొప్పున దీనికి కేటాయిస్తామని కెసిఆర్ చెప్పారు. ఇలా అయితే 30ఏళ్ల వరకు కూడా దళితులకు భూములు పంచలేరు.
5. విద్యుత్ సమస్య : తన చేతిలో ఏమీ లేదని కెసిఆర్ చెబుతున్నారు. కొరత ఉన్నప్పుడు పొరుగున ఉన్న రాష్ర్టాల నుంచి కొనుగోలు చేయాలి. మూడేళ్ల వరకూ కోతలుంటాయని ముందే చెప్పానంటే అప్పటి దాకా చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి ఏంటి? కాబట్టి తక్షణం విద్యుత్తును కొనుగోలు చేసి కొరత లేకుండా చూడాలి.
6. కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ : దీని గురించి స్పష్టంగా ప్రకటించినప్పటికీ నిర్దిష్ట చర్యలు లేవు. దురదృష్టవశాత్తు నిరుద్యోగులు లేదా ప్రభుత్వ ఉద్యోగ ఆశావాహులు, సహ ఉద్యోగులకు ఈ క్రమబద్దీకరణ విషయంలో విభేధాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకూడదు. క్రమబద్దీకరణ సందర్భంగా పాటించాల్సిన అన్ని రూల్లును పాటిస్తూనే, కొందరిలో వచ్చిన అనుమానాలను కూడా నివృత్తి చేయాలి.
7.ఫీజు రీయింబర్స్ మెంట్ : 1956కంటే ముందు నుంచి ఉన్నవారినే స్థానికులనడం కరెక్టు కాదు. ఆ తరువాత ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నవారున్నారు. 'ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడూ తెలంగాణా వాడే` అని కెసిఆర్ ఎన్నికలకు ముందు చెప్పారు. ఆ మాటకు కట్టుబడి ఉండాలి. అలాకాకుండా, కేవలం పాక్షిక దృష్టితో మాత్రమే ముందుకు పోతే మరిన్ని విభేధాలకు ఆస్కారం కల్పించబడుతుంది.
8.వనరుల దోపిడీ : ఒక ప్రాంతం వనరులను మరొక ప్రాంతం దోచుకుంటే అది తప్పు. అయితే వనరుల పంపిణీ విషయంలో దేశంలో ఉన్న అన్ని రాష్ర్టాలు సమన్వయంతో, సామరస్యంతో వ్యవహరించినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇదే స్ఫూర్తిని తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు కూడా తీసుకోవాలి. ఈ స్ఫూర్తితో సామరస్యంగా వ్యవహరించాలి.
9. ఈ నెల 19 సర్వే : ఆరు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా కేవలం ఒకే ఒక్క రోజులో సర్వే పూర్తి చేయాలని టి.సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. బోగస్ ను ఏరివేసేందుకే అని సర్కారు చెబుతోంది. ఉన్నవాటిని ఏరివేసి, సంస్కరణలను వేగంగా అమలు చేసేందుకు ఈ సర్వే జరుగుతోందన్న అనుమానం ఉంది. అయితే దీని గురించి ఆచరణలోనే చూడాల్సి ఉంటుంది.

#10leftparties #Telangana #israel #palestine #daliths #narendramodi #KCR#Feereimbursement #19thsurvey #FDI #powercrisis #CPI(M) #CPI

No comments:

Post a Comment