Monday 19 January 2015

మోడీ ముసుగు తొలుగుతోంది.... ప్రత్యేక ఇంటర్వ్యూలో సీతారాం ఏచూరి


-  మేధావులు ఆలోచిస్తున్నారు
-  ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు
-  ప్రత్యేక ఇంటర్వ్యూలో  సీతారాం ఏచూరి

    అభివృద్ధి పేరుతో ప్రధానమంత్రి నరేంద్రమోడి వేసుకున్న ముసుగు తొలుగుతోందని, మతతత్వ అజెండా పూర్తిస్థాయిలో బయటపడుతోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి అన్నారు. గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌,బిజెపిలు వేరువేరు అన్నట్లుగా వ్యవహరించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితిమారిందని, రెండూ ఒకటే అనే విధంగా సాక్షాత్తు కేంద్రమంత్రులే మాట్లాడుతూనే ఉన్నారని అన్నారు. దేశవ్యాప్తంగా మేథావులు ఈ పరిణామాన్ని గమనిస్తున్నారని చెప్పారు. గతంలో కాంగ్రెస్‌ పాలనను, ప్రస్తుతం బిజెపి ఏలుబడిని గమనిస్తున్న ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని, వామపక్షాలపై ఆ బాధ్యత ఉందని చెప్పారు. సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనడానికి హైదరాబాద్‌ ప్రగతినగర్‌కు వచ్చిన ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు.

ఇంటర్వ్యూ వివరాలు క్లుప్తంగా :
ప్ర: మతోన్మాద ముప్తు పెరుగుతున్న నేపధ్యంలో మేధావుల పాత్ర ఎలా ఉండాలి?
జ : గతంలో ఎప్పటికన్నా కూడా మతోన్మాద ముప్పు పెరుగుతోంది. రాజ్యాంగం ప్రకారం మనది లౌకిక, సామ్యవాద, ప్రజాతంత్ర దేశం. రాజ్యాంగంలో పేర్కొన్న ఈ స్పూర్తికి భిన్నంగా ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర మతోన్మాద శక్తులు వ్యవహరిస్తున్నాయి. మేథావులు ఈ పరిణామాన్ని గమనిస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే స్పందన ప్రారంభమైంది. మేథావుల్లోనూ రెండు రకాలు ఉంటారు. కొందరు మొదటినుండి మతతత్వాన్ని వ్యతిరేకించేవారు. మరికొందరు అవకాశవాద ప్రయోజనాల కోసం పాకులాడేవారు. ఇటువంటి వారితో ప్రభుత్వం తనుకు అనుకూల ప్రచారం చేయించుకుంటోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక వ్యూహం ప్రకారం తన ఆలోచనలను ఆమలు చేస్తోంది.
ప్ర: ప్రధానమంత్రి నరేంద్రమోడి వ్యవహారశైలి ఎలా ఉంది...?
జ : మోడి అసలు స్వభావం త్వరలోనే బట్టబయలవుతుంది. ఇప్పటికే మతోన్మాద సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు ఆయన పెదవి విప్పలేదు. లవ్‌జీహాద్‌, ఘర్‌వాపసీలతో పాటు వివిధ రాష్ట్రాల్లో చోటుచేసుకున్న సంఘటనలపైనా ఆయన ఇదే వైఖరి అవలంభించారు. వాజ్‌పేయి హయంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలు వేరువేరని కనీసం చెప్పేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రే తనతో పాటు ప్రధానమంత్రి కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచే వచ్చారని, దీనిని గొప్పగా భావిస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఇది దురదృష్టకరం. ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండానే మోడి అమలు చేస్తున్నారు.
ప్ర: మతోన్మాద ప్రకటనల పట్ల మోడి తీవ్రంగా బాధపడుతున్నారని ఒక సెక్షన్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి...!
జ : అది కల్పితం. ప్రధానమంత్రి కార్యాలయం లీకుల ద్వారా మీడియాలో ప్రచారంలో పెడుతోంది. ట్విటర్‌,ఫేస్‌బుక్‌, బ్లాగుల్లో మోడి చెప్పారంటూ జరుగుతున్న ప్రచారంతా ప్రధానమంత్రి కార్యాలయం చేస్తున్నదే. మోడి ఈ విషయాలపై ఒక్కసారి కూడా బహిరంగంగా ఖండించలేదు.
ప్ర: హిందూఇజం భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోత్సహిస్తుందని ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు అంటున్నారు కదా?
జ : భిన్నత్వంలో ఏకత్వమే లక్ష్యమైతే హిందూరాష్ట్ర, హిందూరాజ్యం వంటి నినాదాలు దేనికి? రాజ్యాంగంలో స్పష్టంగా ' ఇండియా దటీజ్‌ భారత్‌...' అని రాసుకున్నామేగాని మరో విధంగా చెప్పలేదే! ఇప్పుడు దేశం పేరు మార్చాలన్న వాదన వినిపించడం మత రాజకీయాల్లో భాగమే! 1930వ దశకంలోనే గోవాల్కర్‌ ఈ దేశాన్ని హిందూదేశంగా మార్చాలని, హిందువులకు మాత్రమే అన్నిహక్కులు ఇవ్వాలని, హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించేంతవరకు మిగిలిన మతస్తులను ద్వితీయశ్రేణి పౌరులుగా చూడాలని ప్రతిపాదించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అదే అజెండాను అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. మోడి సర్కారు మద్దతిస్తోంది.
ప్ర: ప్రస్తుతం జరుగుతున్న మతోన్మాద సంఘటనల పట్ల మేథోలోకం పూర్తిస్థాయిలో స్పందించడం లేదన్న అభిప్రాయం వినపడుతోంది...ఎందుకు?
జ : మోడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలల సమయం మాత్రమే గడిచింది. ఈ కొద్ది సమయంలోనే ఇటువంటి నిర్ధారణకు రావడం తప్పు. మోడి ప్రభుత్వంపై ఉన్న భ్రమలు త్వరలోనే తొలగిపోతాయి.
ప్ర: దేశంలోని కార్పొరేట్‌శక్తులు మోడి ప్రభుత్వానికి మద్దతిస్తున్నాయి. దీని ప్రభావం మతోన్మాదంపై ఎలా ఉంటుంది?
జ : నిజానికి ఇదే అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ప్రభుత్వం కార్పొరేట్‌శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ, వాటినుండి ప్రజల దృష్టిని మతోన్మాద చర్యలతో మళ్లిస్తోంది. అయితే, ఈ పరిణామం ఇదే మొదటిసారి కాదు. 1929లో హిట్లర్‌కు అక్కడి కంపెనీల యజమానులు ఇదే విధమైన మద్దతిచ్చారు. ఫాసిజానికి అండగా నిలిచాయి. ఆ తరువాత ఏం జరిగిందో అందరికి తెలుసు. ఇప్పుడు మన దేశంలోకార్పొరేట్‌ శక్తులు వాటి ప్రయోజనాల కోసమే మోడికి అండగా నిలుస్తున్నాయి. మోడి సర్కారు వాటి ప్రయోజనాలను కాపాడుతోంది. అంతర్జాతీయస్థాయిలో తగ్గిన పెట్రోల్‌ డీజల్‌ ధరలను పరిగణలోకి తీసుకుంటే దేశంలో 30నుండి 35 రూపాయలకే లీటర్‌ను విక్రయించాల్సిఉంది. కానీ అలా జరగడం లేదు. ఎక్సైజ్‌డ్యూటీని ప్రభుత్వం సెప్టెంబర్‌ నుండి ఇప్పటికి నాలుగుసార్లు పెంచింది. బంగారం దిగుమతులపై డ్యూటీ తగ్గించారు. రూపాయి విలువ రోజురోజుకి తగ్గుతోంది. రియల్‌ఎస్టేట్‌ పెద్దఎత్తున సాగుతోంది. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ఉత్పాదక రంగాల్లో కాకుండా ఈ తరహా స్పెక్యులేటివ్‌ ధోరణలను పెంచేలా చూడటం పెట్టుబడిదారుల కోసమే. అయితే, ప్రజలు వాస్తవాలను త్వరలోనే గమనిస్తారు. ఐదారు నెలలకాలంలోనే మోడి ప్రభుత్వ అసలు స్వరూపం బట్టబయలవుతుంది. మతోన్మాద అజెండా బహిరంగమవుతుంది.
ప్ర: భారత పెట్టుబడిదారి వర్గమంతా మోడీ వెనకే ఉందా?
జ : తమకు ఎవరు లాభం చేకూరుస్తారని భావిస్తే వారివెనుకే పెట్టుబడిదారులు చేరుతారు. గతంలో వీరే మన్మోహన్‌సింగ్‌ను కీర్తించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అంతటి మేధావి లేరని అప్పట్లో అన్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆయనే ఆధ్యుడని ఇప్పటికీ చెబుతారు. ఆ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగే కొద్ది, తాము ఆశించిన విధానాలను మరింత వేగంగా అమలు చేయించుకునేందుకు మోడిని ముందుకు తెచ్చారు. ప్రజల్లో వ్యతిరేకత పెరిగేకొద్ది వారి వైఖరి మారుతుంటుంది.
ప్ర: కాంగ్రెస్‌ పార్టీ పుంజుకునే అవకాశం ఉందా ...?
జ : 2004లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు తాము అధికారం నుండి వైదొలగతామని బిజెపి ఊహించలేదు. వాజ్‌పేయి ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించిన షాక్‌నుండి 2009 నాటికి కూడా ఆ పార్టీ కోలుకోలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినప్పటికీ అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రజల్లో త్వరలోనే అసంతృప్తి పెరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ పాలన చూసి ఉన్న ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. . ఆ ప్రత్యామ్నాయాన్ని చూపించే బాధ్యత వామపక్షాలపై ఉంది. 

No comments:

Post a Comment